అశ్వాపురం, జూన్ 20: మొండికుంట సమీపంలోని సాయిబాబా ఆలయం వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇసుక లారీ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే ప్రయత్నంలో లారీ అదుపుతప్పి రోడ్డుపక్కనున్న చెట్టును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
స్థానికుల కథనం ప్రకారం, కొత్తగూడెం వైపు వెళ్తున్న ఇసుక లారీ ఒక్కసారిగా అదుపుతప్పి చెట్టును బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు లారీ ముందు భాగం పూర్తిగా ధ్వంసమవగా, డ్రైవర్ వాహనంలోనే ఇరుక్కుపోయాడు. ఈ ఘటనలో డ్రైవర్ చేతులు, కాళ్లు విరిగినట్లు సమాచారం.
ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, స్థానికుల సహకారంతో డ్రైవర్ను వాహనం నుంచి బయటకు తీసేందుకు సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు తెలిసింది.
ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.









