బూర్గంపాడు,వై 7 న్యూస్ ;
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా సారపాక సుందరయ్య నగరంలో కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలదండ వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన జోహార్లు తెలిపారు.
అనంతరం మాట్లాడుతూ… అంబేద్కర్ రచించిన రాజ్యాంగం సామాన్య ప్రజల ప్రయోజనాల కోసం రూపొందించబడిందని, కానీ ప్రస్తుతం అది బలవంతుల చేతుల్లోకి, కార్పొరేట్ శక్తుల ప్రభావంలోకి వెళ్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
సమాజంలో ఇంకా కుల వ్యవస్థ కొనసాగుతున్నదని, చదువు పెరిగినా కూడా చాలామంది కుల ఆచారాలు, సంప్రదాయాలను ఎదిరించలేకపోతున్నారని అన్నారు. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ కుల వ్యవస్థ ఇప్పటికీ కొనసాగడానికి ప్రధాన కారణాలపై సమాజం ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు.
సామాజిక శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం, కుల వ్యవస్థకు మూలం వివాహ వ్యవస్థేనని, ఎవరు ఏ కులంలో పుడితే అదే కులంలో వివాహం చేసుకోవాలనే నిబంధన కుల వ్యవస్థను కొనసాగించడంలో కీలక పాత్ర పోషిస్తోందని వివరించారు. కులాంతర వివాహాలు సమాజ అభివృద్ధికి దోహదపడతాయని కూడా తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు పాపినేని సరోజన, కనకం వెంకటేష్, మీనా, నాగమణి, చందర్రావు, జంపన్న, మచ్చ కృష్ణవేణి, రాధా, కుమారి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.








