దుమ్ముగూడెం, మార్చి 28:
దుమ్ముగూడెం మండలం గౌరారం గ్రామ పంచాయతీ పరిధిలోని పైడాకులమడుగు గ్రామంలో నిన్న సాయంత్రం జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో ఒక కుటుంబం తీవ్ర నష్టాన్ని చవిచూసింది. వర్స రాముడు (తండ్రి: భద్రయ్య) నివాస గృహంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడంతో ఆస్తి నష్టం సంభవించింది.
ఈ ఘటనపై వెంటనే స్పందించిన శ్రీ ద్వాదశ జ్యోతిర్లింగ మహాక్షేత్రం చిన్న అరుణాచలం ఆలయం వ్యవస్థాపకులు శ్రీ శివ నాగ స్వామి, శ్రీ అరుణాచలేశ్వర ట్రస్ట్ తరపున బాధిత కుటుంబానికి సహాయం అందజేశారు.
ట్రస్ట్ ఆధ్వర్యంలో సుమారు రూ.4,000 విలువ చేసే నిత్యావసర వస్తువులు, కాయగూరలు, బియ్యం, బట్టలు అందజేసి కుటుంబానికి అండగా నిలిచారు. ఈ సహాయం బాధితులకు కొంత ఊరటనిచ్చింది.
ఈ కార్యక్రమంలో దుమ్ముగూడెం రెవెన్యూ ఇన్స్పెక్టర్ నరసింహారావు, అరుణ సేవా గణాలు సభ్యులు రమాదేవి, సుజాత, లలిత, వాణి పాల్గొన్నారు. అలాగే మిత్రుడు కనుబుద్ది దేవా కూడా ఈ సహాయక కార్యక్రమంలో పాల్గొన్నారు.
స్థానికులు ట్రస్ట్ సేవలను ప్రశంసిస్తూ, ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత మందికి ఆదర్శంగా నిలుస్తాయని అభిప్రాయపడ్డారు.








