సరఫరా పునరుద్ధరించకపోతే ఆందోళనలు: ఆదివాసీ సేన హెచ్చరిక
మనుగూరు, మార్చి 28:
ప్రభుత్వం గ్యాస్ సరఫరా సక్రమంగా జరుగుతోందని చెబుతున్నప్పటికీ, వాస్తవ పరిస్థితి మాత్రం పూర్తి భిన్నంగా ఉందని ఆదివాసీ సేన రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు వజ్జా జ్యోతి బసు తీవ్రంగా విమర్శించారు. వంటగ్యాస్ (LPG) కొరత తీవ్రమైందని, గ్యాస్ ఏజెన్సీల వద్ద ఎక్కడ చూసినా “నో స్టాక్” బోర్డ్లు కనిపిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
ప్రభుత్వ ప్రకటనలు కేవలం పత్రికలకే పరిమితమైపోయాయని, క్షేత్రస్థాయిలో ప్రజలు రోజులు, వారాలు తిరిగినా గ్యాస్ సిలిండర్లు దొరకని పరిస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది సాధారణ సమస్య కాదని, ప్రజల ప్రాథమిక అవసరాన్ని కూడా తీర్చలేని పాలనకు ఇది నిదర్శనమని అన్నారు.
అధికారుల నిర్లక్ష్యం, గ్యాస్ లభ్యతపై సరైన సమాచారం లేకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ముఖ్యంగా గ్రామీణ మరియు ఆదివాసీ ప్రాంతాల్లో పరిస్థితి మరింత దారుణంగా మారిందని తెలిపారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి గ్యాస్ సరఫరాను పునరుద్ధరించకపోతే, ఆదివాసీ సేన ఆధ్వర్యంలో తీవ్ర ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ప్రజలతో కలిసి రోడ్డెక్కి పోరాటానికి సిద్ధమని స్పష్టం చేశారు.
గ్యాస్ కొరతకు కారణమైన నిర్లక్ష్యపు అధికారులపై తక్షణ చర్యలు తీసుకోవాలని, వాస్తవ పరిస్థితిని ప్రజలకు బహిర్గతం చేయాలని ప్రభుత్వం మరియు సంబంధిత అధికారులను ఆయన డిమాండ్ చేశారు.








