ధర్మఘంట గద్వాల (మే 26):
భూములకు సంబంధించి ఒక రైతుకు అనుకూలంగా సర్వే చేయడానికి లంచం డిమాండ్ చేసిన గద్వాల జిల్లా వడ్డేపల్లి మండల సర్వేయర్ బ్రహ్మయ్య మంగళవారం ఏసీబీ అధికారుల దాడిలో అడ్డంగా బుక్కయ్యారు.రూ. 20,000 డిమాండ్..మండలంలోని ఒక రైతుకు సంబంధించిన మొత్తం నాలుగు ఎకరాల పొలాన్ని సర్వే చేయడానికి ఎకరాకు రూ. 5,000 చొప్పున మొత్తం రూ. 20,000 ఇవ్వాలని సర్వేయర్ బ్రహ్మయ్య సదరు రైతుపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. ఇందులో భాగంగా రైతు నుంచి గతంలోనే అడ్వాన్సుగా రూ. 5,000లు తీసుకున్నారు. మిగిలిన పూర్తి డబ్బులు ఇస్తేనే పొలం సర్వే చేస్తానని, లేదంటే కుదరదని సర్వేయర్ మొండికేయడంతో విసిగిపోయిన బాధిత రైతు మహబూబ్ నగర్ అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు మహబూబ్ నగర్ ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ సారధ్యంలో ఏసీబీ బృందం పక్కా ప్రణాళికతో వడ్డేపల్లిలో నిఘా పెట్టింది. రైతు నుంచి సర్వేయర్ బ్రహ్మయ్య రూ. 10,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి రసాయన పరీక్షలతో సహా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. లంచం సొమ్మును స్వాధీనం చేసుకుని, నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు డీఎస్పీ బాలకృష్ణ తెలిపారు.








