రూ. 3.5 లక్షలు లంచం తీసుకుంటూ దొరికిపోయిన ఎఫ్డీఓ, డీఆర్ఓ
అటవీ శాఖలో అవినీతి తిమింగలాలు మరోసారి ఏసీబీకి చిక్కాయి. రోడ్డు పనుల వ్యవహారంలో కేసు నమోదు చేయకుండా ఉండేందుకు భారీగా లంచం డిమాండ్ చేసిన భద్రాచలం డివిజనల్ అటవీ అధికారి (FDO), సెక్షన్ ఆఫీసర్ గురువారం రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు.
అసలేం జరిగిందంటే?
చర్ల మండలం *పూసుగుప్ప* ప్రాంతంలో కొత్తగా రోడ్డు వేస్తుండగా, పనుల క్రమంలో కొన్ని అటవీ శాఖ చెట్లు దెబ్బతిన్నాయి. ఈ విషయాన్ని సాకుగా చూపి, సదరు కాంట్రాక్టర్ లేదా బాధ్యులపై కేసు నమోదు చేయకుండా ఉండాలంటే *రూ. 10 లక్షలు సమర్పించుకోవాలని భద్రాచలం ఎఫ్డీఓ సుజాత డిమాండ్ చేశారు.
ఏసీబీ వ్యూహం – రెడ్ హ్యాండెడ్ గా అరెస్ట్
బాధితుడు ఏసీబీని ఆశ్రయించడంతో, డిఎస్పీ *వై. రమేష్* ఆధ్వర్యంలో అధికారులు వ్యూహం రచించారు. గురువారం భద్రాచలం కార్యాలయంలో తొలి విడతగా *రూ. 3.5 లక్షలు లంచం తీసుకుంటుండగా ఎఫ్డీఓ సుజాతతో పాటు, చర్ల ఇన్చార్జ్ డీఆర్ఓ (DRO) కృష్ణయ్యను* ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
అవినీతికి పాల్పడే ఏ అధికారిని వదిలే ప్రసక్తే లేదు. బాధితులు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలి.”— వై. రమేష్, ఏసీబీ డిఎస్పీ
అటవీ శాఖలో ఆగని అవినీతి
గతంలో కూడా కొత్తగూడెం అటవీ అభివృద్ధి సంస్థకు చెందిన జిల్లా అధికారి మూడున్నర లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుబడటం గమనార్హం. వరుస ఘటనలతో అటవీ శాఖలో అవినీతి ఏ స్థాయిలో పేరుకుపోయిందో అర్థమవుతోందని స్థానికులు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం ఏసీబీ అధికారులు కార్యాలయంలో సోదాలు నిర్వహిస్తూ, రికార్డులను పరిశీలిస్తున్నారు.








