శ్రీకాకుళం;
స్వాతంత్ర్య సమరయోధుడు, మన్య వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి అదనపు ఎస్పీ శ్రీనివాసరావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా అదనపు ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ, అల్లూరి సీతారామరాజు భారత స్వాతంత్ర్య సమరంలో తన ప్రాణాలను అర్పించిన మహనీయుడని కొనియాడారు. గిరిజనుల హక్కుల పరిరక్షణతో పాటు దేశ స్వేచ్ఛ కోసం ఆయన చేసిన పోరాటం చిరస్మరణీయమని తెలిపారు.
దేశభక్తి, ధైర్యసాహసాలు, త్యాగనిరతి వంటి విలువలను ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని, యువత అల్లూరి సీతారామరాజును ఆదర్శంగా తీసుకొని సమాజ సేవలో ముందుండాలని పిలుపునిచ్చారు. దేశ స్వాతంత్ర్యం కోసం ఆయన చేసిన త్యాగాలను స్మరించుకోవడం ప్రతి భారతీయుడి బాధ్యత అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొని అల్లూరి సీతారామరాజుకు ఘన నివాళులర్పించారు.








