తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద ఖరీఫ్ సీజన్కు సంబంధించిన నాలుగో విడత పెట్టుబడి సాయాన్ని విడుదల చేసింది. ఐదు ఎకరాల వరకు సాగుభూమి కలిగిన రైతుల బ్యాంక్ ఖాతాల్లో రూ.1,188 కోట్లను జమ చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ విడతలో రాష్ట్రవ్యాప్తంగా 4.41 లక్షల మంది రైతులు లబ్ధి పొందారు. రైతులకు ఏడాదికి ఎకరానికి రూ.12 వేల చొప్పున రెండు విడతల్లో ప్రభుత్వం పెట్టుబడి సాయం అందిస్తోంది.
ఇప్పటికే తొలి మూడు విడతల్లో రెండు ఎకరాల నుంచి నాలుగు ఎకరాల వరకు భూమి కలిగిన రైతుల ఖాతాల్లో నిధులు జమయ్యాయి. తొలి విడతలో 44.27 లక్షల మంది రైతులకు రూ.2,482.02 కోట్లు, రెండో విడతలో 10.68 లక్షల మంది రైతులకు రూ.1,590.02 కోట్లు, మూడో విడతలో 6.39 లక్షల మంది రైతులకు రూ.1,330.32 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నిధులతో లక్షలాది ఎకరాల సాగుభూమికి పెట్టుబడి సాయం అందింది.
నాలుగో విడతతో కలిపి ఇప్పటివరకు మొత్తం 65.76 లక్షల మంది రైతుల బ్యాంక్ ఖాతాల్లో రూ.6,590.37 కోట్ల రైతు భరోసా నిధులు జమ చేసినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. రైతులు వ్యవసాయ పనులను సకాలంలో ప్రారంభించేందుకు ప్రభుత్వం దశలవారీగా నిధులను విడుదల చేస్తోందని ఆయన తెలిపారు.








