వై 7 న్యూస్ | చండ్రుగొండ
చండ్రుగొండ గిరిజన వసతి గృహంలో మౌలిక సదుపాయాలు కల్పించాలి : ఏఐఎస్ఎఫ్
చండ్రుగొండ, ఫిబ్రవరి 8 :
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి గుగులోతు వంశీ డిమాండ్ చేశారు.
ఆదివారం ఏఐఎస్ఎఫ్ చండ్రుగొండ మండల సమితి ఆధ్వర్యంలో పలు వసతి గృహాలను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడిన గుగులోతు వంశీ, వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ, చండ్రుగొండ గిరిజన వసతి గృహంలో విద్యార్థులకు కనీస మౌలిక సదుపాయాలు కూడా లేవని ఆవేదన వ్యక్తం చేశారు. సరిపడా తరగతి గదులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే రాష్ట్ర ప్రభుత్వానికి పట్టదా అని ప్రశ్నించారు.
అదేవిధంగా చండ్రుగొండ గిరిజన వసతి గృహంలో ఫిజిక్స్ ఉపాధ్యాయుడు, పీఈటీ ఉపాధ్యాయులను తక్షణమే నియమించాలని డిమాండ్ చేశారు. వసతి గృహాల సమస్యలను పరిష్కరించకుండా రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆరోపించారు. అనేకసార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
తక్షణమే ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున విద్యార్థి ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా సమితి సభ్యులు అనిల్ కుమార్, సాయి తేజ, అఖిల్, మండల నాయకులు హేమంత్ నాయక్, ఆనంద్ కుమార్, ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.








