వై 7 న్యూస్ | అశ్వారావుపేట
అశ్వారావుపేట మున్సిపాలిటీలో జరుగుతున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మద్దతుతో పోటీ చేస్తున్న భారత రాష్ట్ర సమితి అభ్యర్థుల గెలుపు కోసం అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు తాటి వెంకటేశ్వర్లు గడప గడపకు ప్రచారం నిర్వహించారు.
మూడవ మరియు పదిహేనవ వార్డుల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల విజయాన్ని లక్ష్యంగా చేసుకుని ఆయన ఇంటింటా తిరుగుతూ ఓటర్లను కలిశారు. ఈ సందర్భంగా మూడవ వార్డు అభ్యర్థి ప్రకాష్ రావు, పదిహేనవ వార్డు అభ్యర్థి నర్లపాటి శ్రీనివాసరావులను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.
ప్రచార సమయంలో తాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. హామీల పేరుతో ప్రజలను మోసం చేస్తోందని, నిజమైన అభివృద్ధి భారత రాష్ట్ర సమితితోనే సాధ్యమని అన్నారు. మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధి కోసం కారు గుర్తుకు ఓటు వేసి అభ్యర్థులను ఆశీర్వదించాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కట్ట్రం స్వామిదొర, అంకిత మల్లికార్జున రావు, జూపల్లి రమణ రావు, జూపల్లి పద్మజతో పాటు నియోజకవర్గ, మండల నాయకులు, వార్డు ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని అభ్యర్థులకు మద్దతు తెలిపారు.








