భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వివాదం
పినపాక;
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా అమలవుతున్న PM SHRI (ప్రధాన్ మంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా) పథకం కింద గవర్నమెంట్ స్కూళ్లలో ఆడపిల్లలకు సెల్ఫ్ డిఫెన్స్ శిక్షణ పేరుతో జరుగుతున్న నియామకాల్లో తీవ్ర అక్రమాలు చోటుచేసుకున్నాయని సీనియర్ కరాటే మాస్టర్ ఇర్ప రవికుమార్ దొర ఆరోపించారు.
ఎలాంటి అధికారిక నోటిఫికేషన్ లేకుండా, పత్రికా ప్రకటన ఇవ్వకుండా, GCDO అన్నమణి ఆధ్వర్యంలో కొంతమంది ఎంపిక చేసిన మాస్టర్లకే సమాచారం ఇచ్చి, స్కిల్ టెస్ట్ పేరుతో నియామకాలు చేపట్టారని ఆయన తెలిపారు. తనకు అనుకూలంగా ఉన్న జూనియర్ మాస్టర్లను జడ్జిలుగా నియమించి, 30 సంవత్సరాల అనుభవం ఉన్న సీనియర్ కరాటే మాస్టర్లను పక్కనపెట్టి, అనుభవం లేని జూనియర్లకు అవకాశాలు కల్పించారని ఆరోపించారు.
గత సంవత్సరం తాను AHS గర్ల్స్ ఎలిసిరెడ్డిపల్లి హాస్టల్ స్కూల్లో కరాటే శిక్షణ ఇచ్చానని, అయినప్పటికీ ఈసారి తనకు అవకాశం నిరాకరించారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ ఆదేశాల ప్రకారం PM SHRI పథకం కింద మూడు నెలలపాటు సాయంత్రం వేళల్లో మొత్తం 72 కరాటే క్లాసులు నిర్వహించాల్సి ఉంటుందని, కానీ ఈ నిబంధనలను పూర్తిగా ఉల్లంఘిస్తూ మణుగూరు మండలానికి చెందిన పద్మ అనే మహిళకు మూడు స్కూల్స్ కేటాయించడం అన్యాయమని అన్నారు.
పినపాక మండలం ఎలిసిరెడ్డిపల్లి, మణుగూరు గురుకులం, అశ్వాపురం మండలంలోని స్కూల్స్ను ఒకే వ్యక్తికి కేటాయించడం ద్వారా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని ఆరోపించారు. మూడు మండలాల్లోని స్కూల్స్ను ఒక్కరికే ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు.
ఈ వ్యవహారాన్ని తక్షణమే నిలిపివేయాలని, GCDO అన్నమణిని సస్పెండ్ చేయాలని, జిల్లాలో ఉన్న సీనియర్ కరాటే మాస్టర్లను, ముఖ్యంగా ఆదివాసి కరాటే మాస్టర్లను గుర్తించి ITDA ద్వారా పారదర్శకంగా నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. స్థానిక మండలాల్లో ఉన్న స్థానిక కరాటే మాస్టర్లకే ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు.
లేకపోతే ఈ అంశంపై కోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరిస్తున్నట్లు ఇర్ప రవికుమార్ దొర తెలిపారు.









