మణుగూరు;
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని మణుగూరు మేజర్ సమితి సింగారం గ్రామపంచాయతీలో జరిగిన ఉద్రిక్త ఘటన స్థానికంగా కలకలం రేపింది. BRS పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గుండి గౌరీ ఎన్నికల ప్రచార వాహనంపై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాడి చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.
సాక్షుల సమాచారం ప్రకారం, ప్రచార వాహనాన్ని అడ్డగించి, డ్రైవర్ను అనుచిత వ్యాఖ్యలతో బెదిరించినట్లు తెలుస్తోంది. దీంతో అక్కడ ఒకింత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ సంఘటనపై BRS పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా ఎన్నికల ప్రచారం సాగుతూ ఉండగా, కాంగ్రెస్కు చెందిన గుంపులు ఎన్నికల నిబంధనలను బేఖాతరు చేస్తూ దాడులకు పాల్పడటం ప్రజాస్వామ్య పద్ధతులకు విరుద్ధమని ఆయన విమర్శించారు.
“ప్రజాభిప్రాయం BRS వైపు ప్రవహిస్తోందని భయపడి దాడులకు దిగుతున్నారు” రేగా కాంతారావు
రేగా కాంతారావు మాట్లాడుతూ,
BRS పార్టీ ప్రజల మద్దతుతో బలంగా ముందుకు సాగుతుండటంతో ప్రత్యర్థులు హింసకు పాల్పడుతున్నారని,
ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన కాంగ్రెస్ కార్యకర్తలపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఎన్నికల అధికారులు, పోలీస్ శాఖను డిమాండ్ చేశారు.
ఇలాంటి బెదిరింపులు, దాడులతో BRS పార్టీని నిలువరించడం అసాధ్యమని స్పష్టం చేశారు.
BRS నాయకులు, కార్యకర్తలు ఈ ఘటనను ఖండిస్తూ, శాంతియుత ప్రచారాన్ని కొనసాగించనున్నట్లు తెలిపారు.









