– కాలు లేని కూతురు…అండ లేని తల్లి!
– ఏడేళ్ల నిరీక్షణ 13 ఏళ్ల ఆవేదన
– అర్హత ఉన్న దక్కని పెన్షన్లు కన్నీరు మున్నీరు అవుతున్న తల్లి కుమార్తె
చింతూరు (వై7 న్యూస్) ఆగస్టు 06: పోలవరం జిల్లా చింతూరు మండలం, పేగ పంచాయతీ లోని ఆదివాసీ అండ లేని వితంతువు, నడవలేని కూతురు.. ఏడేళ్లుగా అందని పెన్షన్లు!… ప్రభుత్వాలు మారుతున్నా, సంక్షేమ పథకాలు ఇంటింటికీ అందుతున్నాయని పాలకులు చెప్తున్నా.. ఇక్కడి ఓ ఆదివాసీ కుటుంబానికి మాత్రం దశాబ్ద కాలంగా అన్యాయమే జరుగుతోంది. పేగ పంచాయతీ పరిధిలోని వంకగూడెం గ్రామానికి చెందిన మడకం నాగమ్మ , కూతురు మడకం రమాదేవి ల ఒక నిరుపేద ఆదివాసీ కుటుంబం పెన్షన్లు రాక తీవ్ర ఇబ్బందులు పడుతోంది.ఆ కుటుంబ పెద్ద (భర్త) చనిపోయి ఏడేళ్లు గడుస్తున్నా ఆ భార్యకు వితంతు పెన్షన్ మంజూరు కాలేదు. మరోపక్క, ఆమె కుమార్తె పుట్టుకతోనే కాలు వైకల్యంతో బాధపడుతోంది. ప్రస్తుతం 13 ఏళ్లు దాటినా మడకం రమాదేవికి ఇంతవరకు వికలాంగ పెన్షన్ అందలేదు. ఒకపక్క భర్త లేని లోటు, మరోపక్క వైకల్యంతో బాధపడుతున్న కూతురిని సాకలేక ఆ తల్లి పడుతున్న నరకయాతన వర్ణనాతీతం. తమకు పెన్షన్లు మంజూరు చేయాలని ఏడేళ్లుగా అధికారుల చుట్టూ, కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆ ఆదివాసీ మహిళ కన్నీరుమున్నీరవుతోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, వంకగూడెంలోని ఈ ఆదివాసీ కుటుంబానికి తక్షణమే వితంతు, వికలాంగ పెన్షన్లు మంజూరు చేసి ఆదుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.








