నేపాల్లోని రసువా ప్రాంతంలో భోటేకోషి నదికి వచ్చిన వినాశకరమైన ఫ్లాష్ ఫ్లడ్స్ తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఈ ప్రాణాంతక వరదల్లో ఇప్పటివరకు సుమారు 160 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 750 మందికి పైగా గల్లంతైనట్లు సమాచారం. వరద ప్రవాహం ధాటికి రహదారులు, వంతెనలు కొట్టుకుపోవడంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. ప్రభుత్వ ప్రాథమిక గణాంకాల ప్రకారం 35 ప్రధాన వంతెనలు, 45 సస్పెన్షన్ బ్రిడ్జిలు ధ్వంసమయ్యాయి. దీంతో అనేక గ్రామాలు బాహ్య ప్రపంచంతో సంబంధాలు కోల్పోయాయి.
మరోవైపు ఈ భారీ వరదల కారణంగా 13 జలవిద్యుత్ ప్రాజెక్టులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. భారీ నీటి ప్రవాహంలో ఎన్నో వాహనాలు కొట్టుకుపోయాయి. నేపాల్ సైన్యం రంగంలోకి దిగి ఇప్పటికే 250 మందికి పైగా బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. అయితే ఇంకా వందలాది మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. గల్లంతైన వారిలో 139 మంది భారతీయ పౌరులు ఉన్నట్లు సమాచారం. దీంతో భారతీయ కుటుంబాల్లోనూ తీవ్ర ఆందోళన నెలకొంది.
వరదల్లో చిక్కుకుని ప్రాణాలతో బయటపడిన ఓ బాధితుడు తన భయానక అనుభవాన్ని వివరించారు. వరద ఒక్కసారిగా ముంచెత్తడంతో ప్రాణాలు కాపాడుకునేందుకు ఇంటి కప్పుపైకి ఎక్కామని, అయితే ఆ సమయంలో తన భార్య ఇంటి శిథిలాల కింద చిక్కుకుపోయిందని కన్నీటిపర్యంతమయ్యారు. దాదాపు 4 నుంచి 5 గంటల పాటు నరకయాతన అనుభవించిన తర్వాత హెలికాప్టర్ ద్వారా తనను రక్షించారని తెలిపారు. ప్రస్తుతం గల్లంతైన వారి కోసం భారీగా సహాయక చర్యలు కొనసాగుతున్నప్పటికీ.. ప్రతికూల వాతావరణం, దెబ్బతిన్న రహదారులు, వంతెనల కారణంగా రెస్క్యూ ఆపరేషన్కు తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయి.









