దుమ్ముగూడెం, జూలై 13 (వై7 న్యూస్):
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలంలోని ములకపాడు గ్రామపంచాయతీలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. గ్రామపంచాయతీ సర్పంచ్ తులసమ్మ ఆదేశాల మేరకు గ్రామంలోని వీధులు, కాలువలు, ప్రజా ప్రదేశాల్లో బ్లీచింగ్ చల్లడం, శానిటేషన్ పనులు నిర్వహించడం ప్రారంభించారు.
గ్రామంలో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తూ పారిశుద్ధ్య కార్యక్రమాలను ముమ్మరం చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ పనులను సర్పంచ్ తులసమ్మతో పాటు ఉపసర్పంచ్ స్వయంగా పర్యవేక్షిస్తూ సిబ్బందికి అవసరమైన సూచనలు అందించారు.
ఈ సందర్భంగా ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నిల్వ నీరు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సర్పంచ్ తులసమ్మ సూచించారు. గ్రామంలో డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
గ్రామ ప్రజల ఆరోగ్య రక్షణే లక్ష్యంగా శానిటేషన్ కార్యక్రమాలు కొనసాగుతాయని గ్రామపంచాయతీ ప్రతినిధులు తెలిపారు.









