లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దేశ విద్యా వ్యవస్థపై తీవ్ర విమర్శలు చేశారు. భారత్లో విద్యా వ్యవస్థ పూర్తిగా మోసపూరితంగా మారిందని, విద్యా రంగంలో తక్షణమే విప్లవాత్మక మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. విద్య పేరుతో సామాన్య ప్రజలపై జరుగుతున్న దోపిడీని అరికట్టాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన ‘ఎక్స్’ వేదికగా చేసిన పోస్టులో తెలిపారు.
ప్రస్తుత విద్యా వ్యవస్థ అవినీతి, అన్యాయం, పక్షపాత వైఖరి, నిజాయితీ లోపంతో నిండిపోయిందని రాహుల్ గాంధీ విమర్శించారు. విద్యార్థులే ఈ పరిస్థితిని తీవ్రంగా ప్రశ్నిస్తున్నారని పేర్కొంటూ, పిల్లల భవిష్యత్ను తీర్చిదిద్దాల్సిన విద్యా వ్యవస్థ నేడు సగటు కుటుంబాలను అప్పుల ఊబిలోకి నెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యా రంగంలో అవినీతి కారణంగానే పేపర్ లీకేజీ మాఫియా పెరిగిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. తప్పు చేసిన సంస్థలకు మళ్లీ టెండర్లు ఇవ్వడం, బాధ్యులైన అధికారులకు ప్రమోషన్లు కల్పించడం జరుగుతోందని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు ఈ అక్రమాలపై పూర్తి అవగాహన ఉన్నప్పటికీ, జవాబుదారీతనం లేకుండా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు.








