ఖమ్మం;
ఖమ్మం నగరంలో అక్రమంగా అధిక వడ్డీలకు రుణాలు ఇస్తూ అమాయక ప్రజలను మోసం చేస్తున్న ముఠాపై పోలీసులు చర్యలు చేపట్టారు. విశ్వసనీయ సమాచారంతో ఖానాపురం హవేలి ఇన్స్పెక్టర్ భానుప్రకాశ్ తన సిబ్బందితో కలిసి గల్లీ బజార్లోని ఓ గదిపై దాడి నిర్వహించి, తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలానికి చెందిన కలెక్షన్ ఏజెంట్ కర్రి మణికంటరెడ్డి (31)ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.
టౌన్ ఏసీపీ రమణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం, ఈ కేసులో కర్రి భామిరెడ్డి, సతి వంశీకృష్ణ రెడ్డి పరారీలో ఉన్నారు. వీరు ప్రధాన నిందితుడు సబ్బల్ల సత్యనారాయణరెడ్డి వద్ద కలెక్షన్ ఏజెంట్లుగా పనిచేస్తూ, ఖమ్మంలోని కాల్వోడ్డు, పాండురంగాపురం, వెలుగుమట్ల, పంపింగ్ వెల్ రోడ్, వైఎస్సార్ కాలనీ, రామన్నపేట ప్రాంతాల ప్రజలకు ప్రభుత్వ అనుమతులు లేకుండా అధిక వడ్డీలకు రుణాలు ఇస్తూ మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు.
నిందితుడి వద్ద నుంచి అకౌంట్ బుక్లు, డైలీ కలెక్షన్ బుక్లు, కలెక్షన్ రిజిస్టర్లు, కస్టమర్ వివరాల రికార్డులు స్వాధీనం చేసుకున్నారు.
ప్రజలు ఇలాంటి మోసగాళ్ల మాటలు నమ్మి అధిక వడ్డీ రుణాలు తీసుకొని ఆర్థిక ఇబ్బందుల్లో పడవద్దని, అవసరమైతే చట్టబద్ధమైన బ్యాంకులు లేదా గుర్తింపు పొందిన ఆర్థిక సంస్థలను మాత్రమే ఆశ్రయించాలని ఏసీపీ సూచించారు.








