ఖమ్మం జిల్లా వైరా పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమ ఇసుక రవాణాపై పోలీసులు మరోసారి కఠిన చర్యలు చేపట్టారు. శుక్రవారం నిర్వహించిన వాహన తనిఖీలలో ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా దొనబండ రీచ్ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా సుమారు 25 టన్నుల ఇసుకను తరలిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు.
ఈ కేసులో చల్లమల్ల వెంకటేశ్వరరావు, చల్లమల్ల సుమంత్ కుమార్, లారీ డ్రైవర్ కొండేటి ఉపేందర్ను అరెస్టు చేశారు. అక్రమ రవాణాకు ఉపయోగించిన అశోక్ లేలాండ్ లారీ, మహీంద్రా థార్ కారు, టిప్పర్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
దర్యాప్తులో నిందితులు ఆంధ్రప్రదేశ్లో తక్కువ ధరకు ఇసుకను కొనుగోలు చేసి, తెలంగాణలో అధిక ధరలకు విక్రయిస్తూ అక్రమ లాభాలు పొందుతున్నట్లు వెల్లడైంది. ప్రధాన నిందితుడు సుమంత్ కుమార్పై ఇప్పటికే 12 క్రిమినల్ కేసులు నమోదై ఉండగా, పలు కేసుల్లో శిక్షలు కూడా విధించబడినట్లు పోలీసులు తెలిపారు. వెంకటేశ్వరరావుపై కూడా ఈ కేసుతో కలిపి నాలుగు కేసులు నమోదైనట్లు గుర్తించారు.
అలవాటుగా నేరాలకు పాల్పడే వ్యక్తులపై హిస్టరీ షీట్లు, అవసరమైతే రౌడీ షీట్లు తెరిచి నిరంతర నిఘా కొనసాగిస్తామని పోలీసులు హెచ్చరించారు. అక్రమ ఇసుక తవ్వకం, రవాణా, నిల్వ, కొనుగోలు లేదా విక్రయాల్లో పాల్గొనే వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
“అక్రమ ఇసుక మాఫియాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించం. చట్టాన్ని ధిక్కరించే వారికి కఠిన శిక్షలు తప్పవు” అని వైరా డివిజన్ ఏసీపీ సారంగపాణి సాదుల హెచ్చరించారు.








