నందిగాం, జూన్ 13 (వై న్యూస్): శ్రీకాకుళం జిల్లా నందిగాం జాతీయ రహదారిపై శనివారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు.
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సంతబొమ్మాళి మండలం రాజగోపాలపురం గ్రామానికి చెందిన జే. అనసూయమ్మ (55) తన కుమారుడు ఉమాపతిరావుతో కలిసి ద్విచక్ర వాహనంపై టెక్కలి వైపు వెళ్తుండగా, ఆకుల రఘునాథపురం గ్రామ సమీపంలో ఓ ప్రైవేట్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అనసూయమ్మ అక్కడికక్కడే మృతి చెందగా, కుమారుడు ఉమాపతిరావుకు తీవ్ర గాయాలయ్యాయి.
ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన ఉమాపతిరావును చికిత్స నిమిత్తం టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పంచనామా నిర్వహించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిసింది.
ఈ ఘటనతో రాజగోపాలపురం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు.








