వై7 న్యూస్ పలాస
చిత్తూరు జిల్లా వీకోట మండలానికి చెందిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి రిపోర్టర్ జగన్మోహన్ రెడ్డి హత్యను ఖండిస్తూ పలాస నియోజకవర్గంలో జర్నలిస్టులు ఆందోళన చేపట్టారు. పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో ఏపీ యూడబ్ల్యూజే ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు.
మంగళవారం ఉదయం వాకింగ్కు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడి చేసి జగన్మోహన్ రెడ్డిని దారుణంగా హత్య చేసిన ఘటనపై జర్నలిస్టులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా కాశీబుగ్గ డీఎస్పీ భవాని కి వినతిపత్రం అందజేశారు. జర్నలిస్టుల భద్రతకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని కోరారు.









