వై 7 న్యూస్ ఇల్లందు ;
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో జిల్లా కలెక్టర్ అంకిత్ మంగళవారం ఆకస్మిక పర్యటన చేపట్టి ప్రభుత్వ ఆసుపత్రి, ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలు, వివిధ వసతి గృహాలను విస్తృతంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వైద్య సేవలు, విద్యార్థుల సంక్షేమం, ఆహార నాణ్యత, పరిశుభ్రత, మౌలిక వసతులపై సమగ్రంగా పరిశీలించిన కలెక్టర్, లోపాలు గమనించిన చోట్ల కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఆసుపత్రిలో లోపాలపై ఆగ్రహం
మొదటగా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్, ఆసుపత్రి నిర్వహణ, సేవల నాణ్యతపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆసుపత్రి ఎదుట ప్రైవేట్ అంబులెన్స్ నిలిపివేయడం గమనించి అనుమతులపై అధికారులను ప్రశ్నించారు. ఇన్పేషెంట్ విభాగంలో రోగులతో మాట్లాడి సేవలపై ఆరా తీశారు. డయాలసిస్ కేంద్రాన్ని పరిశీలించి కేసుల పెరుగుదలపై అధ్యయనం చేయాలని సూచించారు.
అత్యవసర సేవల్లో నిర్లక్ష్యం కారణంగా రోగి మరణించిన ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్, సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అత్యవసర సేవల్లో ఎలాంటి లోపాలు సహించబోమని స్పష్టం చేశారు.
వసతి గృహాల్లో దారుణ పరిస్థితులు
ట్రైబల్ వెల్ఫేర్ బాలికల వసతి గృహంలో మెనూ పాటించకపోవడం, ఆహార నాణ్యత లోపించడం గమనించి కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. స్టోర్రూమ్లో సరుకుల నిల్వ విధానంపై సూచనలు చేశారు. విద్యార్థులతో మాట్లాడి తాగునీరు, ఫ్యాన్లు, భవన మరమ్మతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.
ఆశ్రమ బాలుర పాఠశాలలో భోజనం సమయానికి లేకపోవడం, పరిశుభ్రత లోపాలు తీవ్రంగా ఉన్నట్లు గుర్తించిన కలెక్టర్, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన వార్డెన్ భరత్ను తక్షణమే సస్పెండ్ చేయాలని ఆదేశించారు.
హాస్టల్ ఖాళీ – కలెక్టర్ షాక్
షెడ్యూల్ కులాల బాలుర వసతి గృహాన్ని తనిఖీ చేసిన సమయంలో విద్యార్థులు, సిబ్బంది ఎవరూ లేకపోవడం కలెక్టర్ను ఆశ్చర్యానికి గురి చేసింది. నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించడంతో సంబంధిత వార్డెన్పై వెంటనే సస్పెన్షన్ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
వెనుకబడిన తరగతుల హాస్టల్లో కూడా భోజనం సమయానికి సిద్ధం కాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించడం తప్పనిసరి బాధ్యత అని హెచ్చరించారు.
కఠిన హెచ్చరిక
వసతి గృహాల నిర్వహణలో నిర్లక్ష్యం ప్రదర్శించిన ఇద్దరు వార్డెన్లను సస్పెండ్ చేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. విద్యార్థుల ఆరోగ్యం, భద్రత, సంక్షేమంపై ఎటువంటి నిర్లక్ష్యం సహించబోమని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ హర్షవర్ధన్, ఆర్ఎంఓ రామ్ నివాస్, డాక్టర్ ప్రత్యూష తదితర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.









