వై7 న్యూస్ | భద్రాచలం
పెంచిన కమర్షియల్ సిలిండర్ రేట్లు తగ్గించాలని సిపిఐఎం ఆందోళన
భద్రాచలం పట్టణంలో గ్యాస్ ధరల పెరుగుదలపై సిపిఐఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. చర్ల రోడ్డులో చేపట్టిన ఈ ఆందోళనలో కేంద్ర ప్రభుత్వ విధానాలను తీవ్రంగా ఖండించారు.
ఈ కార్యక్రమానికి సిపిఐఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.బి. నర్సారెడ్డి హాజరై మాట్లాడుతూ, గ్యాస్ మరియు పెట్రోలియం ధరలను అదుపు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ధరలను నియంత్రించలేకపోతే ప్రధానమంత్రి పదవి నుండి దిగిపోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇటీవల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను రూ.1600 నుంచి రూ.2300 వరకు పెంచడం సాధారణ ప్రజలపై తీవ్ర భారం మోపుతోందని అన్నారు. గృహ వినియోగ గ్యాస్ ధరలను కూడా రూ.1000 వరకు పెంచడానికి అంతర్జాతీయ పరిస్థితులను కారణంగా చూపించడం సిగ్గుచేటని విమర్శించారు.
ఇరాన్పై అమెరికా, ఇజ్రాయిల్ యుద్ధాన్ని కారణంగా చూపుతున్న కేంద్ర ప్రభుత్వం, ఆ దేశాల వైఖరిని ఎందుకు ఖండించడం లేదని ప్రశ్నించారు. ఒకప్పుడు అలీన దేశాల విధానం పాటించిన భారత్, ప్రస్తుతం విదేశీ విధానాల్లో మార్పులు చేసిందని ఆరోపించారు.
గ్యాస్ ధరల పెరుగుదల వల్ల చిన్న వ్యాపారులు, పానీపూరి బండి, చిన్న హోటల్ వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నర్సారెడ్డి తెలిపారు. గ్యాస్ సరఫరా సక్రమంగా లేకపోవడంతో బ్లాక్ మార్కెట్లో కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొన్నదని అన్నారు.
గ్యాస్, ఆయిల్ ధరలను ప్రైవేటీకరణ చేయడం వల్ల ప్రభుత్వానికి నియంత్రణ కోల్పోయిందని, దీనివల్ల పెద్ద కార్పొరేట్ సంస్థలు లాభాలు పొందుతున్నాయని ఆరోపించారు. ముఖ్యంగా అంబానీ, ఆదానీలకు లాభాలు చేకూర్చే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు.
రాష్ట్ర ప్రభుత్వంపైనా ఆయన విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ సమస్యలపై దృష్టి పెట్టకుండా ఇతర రాష్ట్రాల్లో రాజకీయ వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
గ్యాస్ ధరలను తగ్గించేందుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకురాకపోతే సిపిఐఎం ఆధ్వర్యంలో పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సిపిఐఎం నాయకులు ఎన్. నాగరాజు, కుంజ శ్రీను, అజయ్ కుమార్, బీబీజీ తిలక్, ఎంవీఎస్ నారాయణ, మాధవరావు, మురళీకృష్ణ, భీమేశ్వరరావు, ముత్తయ్య, రవీందర్, అబ్దుల్ సత్తార్, సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.








