భద్రాచలం దివ్యక్షేత్రంలోని పుణ్య గోదావరి స్నాన ఘట్టాల వద్ద నిర్వహిస్తున్న గోదావరి హారతి కార్యక్రమం భక్తి భావాన్ని మరింత పెంచుతోంది. పరాభవ నామ సంవత్సరంలో చైత్ర శుద్ధ చవితి మాసంలోకి ప్రవేశించిన నేపథ్యంలో భక్తుల సంఖ్య మరింత పెరుగుతుందని పురోహితులు రామవజల రవికుమార్ తెలిపారు.
ఆదివారం సాయంత్రం భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దివ్యక్షేత్రంలోని గోదావరి కరకట్ట వద్ద జరిగిన నదీహారతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, చైత్ర శుద్ధ చవితి రోజుకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉందని, ఆ రోజు నిర్వహించే గోదావరి హారతి అత్యంత విశిష్టమైనదని చెప్పారు.
అనంతరం గోదావరి హారతి విశేషాలను, చైత్ర మాస ప్రాధాన్యతను భక్తులకు వివరించారు. గణపతి పూజ, దీపోత్సవం నిర్వహించి, పూజా ద్రవ్యాలతో గోదావరి నదికి అష్టోత్తర శతనామార్చన చేశారు. లోకక్షేమార్థం ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న ఈ మహత్తర కార్యక్రమంలో గ్రామస్తులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటూ రామానుగ్రహంతో గోదావరి మాత ఆశీస్సులు పొందుతున్నారని తెలిపారు.
కార్యక్రమం అనంతరం శాంతి మంత్రాల పఠనం జరిపి, సిరిపురపు అశోక్ కుమార్ శర్మ దంపతులు భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. నదీహారతి కార్యక్రమానికి అవసరమైన పూజా సామగ్రిని భద్రాచలం రెడీమేడ్ బట్టల షాప్ అసోసియేషన్ అందించింది.
గోదావరి నదీహారతి ప్రారంభానికి ముందు తెలంగాణ రాష్ట్రం అనిల్ అకాడమీ ఆర్ట్స్, నిత్య భారతి కళాశాల, హైదరాబాద్కు చెందిన బాలబాలికలు అద్భుత నృత్య ప్రదర్శనతో భక్తులను ఆకట్టుకున్నారు.
ఈ కార్యక్రమంలో వీఆర్ఓ వరలక్ష్మి వెంకటేశ్వర్లు, పురోహితులు సురేష్ శర్మ, అశోక్ కుమార్ శర్మ, వీరభద్ర శర్మ, రామాచార్యులు, ప్రసాద్ శర్మ, ఫణి కుమార్ శర్మ, కృష్ణ శర్మ, తేజ శర్మతో పాటు స్వచ్ఛంద సంస్థలు, భక్తులు పాల్గొన్నారు.








