సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్లో ఇండియన్ సినీ హిస్టరీలోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన ‘దృశ్యం’ ఫ్రాంచైజీ ఇప్పుడు మూడో భాగంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. మోహన్లాల్ ప్రధాన పాత్రలో జీతూ జోసెఫ్ తెరకెక్కించిన ఈ మలయాళ చిత్రం ఇప్పటికే రెండు భాగాలతో సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. అయితే, ‘దృశ్యం-3’ షూటింగ్ పనులు ప్రారంభం కాకముందే ఈ సినిమా ఒక ఊహించని వివాదంలో చిక్కుకుంది. కేరళ మోటార్ వాహనాల శాఖ (MVD) ఈ చిత్ర బృందానికి ఒక షాకింగ్ హెచ్చరిక జారీ చేయడంతో ఈ వివాదం మొదలైంది.
ఈ వివాదానికి ప్రధాన కారణం ‘దృశ్యం-2’ క్లైమాక్స్లో చూపించిన ఒక కీలకమైన సీన్. ఆ సీన్లో హీరో జార్జ్కుట్టి ఒక కారు నంబర్ ప్లేట్ను మార్చి, పోలీసుల కళ్లుగప్పి క్రైమ్ సీన్ నుండి తప్పించుకుంటాడు. అయితే, సినిమాలో చూపించిన ఆ నంబర్ ప్లేట్ (‘KL 07 CH 7421’) కేరళకు చెందిన ఒక సాధారణ పౌరుడి అసలైన వాహన నంబర్. సినిమా విడుదలైనప్పటి నుండి ఆ వాహన యజమాని తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ప్రతిచోటా పోలీసులు అతని వాహనాన్ని ఆపి అనుమానంగా తనిఖీలు చేయడం, నెటిజన్లు సోషల్ మీడియాలో ట్రోల్ చేయడంతో అతను మానసిక వేదనకు గురై, రవాణా శాఖ అధికారులను ఆశ్రయించాడు.
ఈ నేపథ్యంలో స్పందించిన కేరళ మోటార్ వాహనాల శాఖ, ‘దృశ్యం-3’ మేకర్స్కు గట్టి నోటీసులు పంపింది. రాబోయే పార్ట్లో సదరు వ్యక్తికి చెందిన నంబర్ ప్లేట్ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించకూడదని, ఒకవేళ వాడితే చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. సినిమాలో చూపించే నంబర్ ప్లేట్ల విషయంలో ముందే జాగ్రత్తలు తీసుకోవాలని, ఇతరుల ప్రైవసీకి భంగం కలిగించవద్దని స్పష్టం చేసింది. దీంతో జార్జ్కుట్టి తెలివితేటల చుట్టూ తిరిగే ఈ కథకు, ఇప్పుడు రియల్ లైఫ్లోనే నంబర్ ప్లేట్ పెద్ద తలనొప్పిగా మారిందని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.








