శ్రీకాకుళం, మే 31 (వై7 న్యూస్):
శ్రీకాకుళం పట్టణంలోని పెద్ద రెల్లి వీధిలో ఆదివారం రెండవ పట్టణ పోలీసుల ఆధ్వర్యంలో ప్రత్యేక కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి ఆదేశాల మేరకు ఇన్స్పెక్టర్ ఈశ్వరరావు నేతృత్వంలో జరిగిన ఈ తనిఖీల్లో శ్రీకాకుళం సబ్డివిజన్ పరిధి పోలీసులు పాల్గొన్నారు.
నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ, గంజాయి, మద్యం మరియు ఇతర అక్రమ నిల్వల గుర్తింపు, అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై నిఘా పెంపు లక్ష్యంగా ఈ ఆపరేషన్ చేపట్టారు. ఇందులో భాగంగా ఇళ్లు, వీధులు, ఖాళీ స్థలాలు, పార్కింగ్ ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
అలాగే వాహనాల రిజిస్ట్రేషన్ ధ్రువపత్రాలు, డ్రైవింగ్ లైసెన్సులు తదితర అవసరమైన పత్రాలను పరిశీలించారు. తనిఖీల సందర్భంగా సరైన పత్రాలు లేని 10 ద్విచక్ర వాహనాలను గుర్తించి సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. సంబంధిత వాహన యజమానులు అవసరమైన పత్రాలను సమర్పించాలని సూచించడంతో పాటు మోటారు వాహనాల చట్టం ప్రకారం తదుపరి చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ ఈశ్వరరావు మాట్లాడుతూ, నేరాల నివారణ, గంజాయి, మద్యం అక్రమ రవాణా అరికట్టడం, చోరీకి గురైన వాహనాల గుర్తింపు, ఇతర అక్రమ కార్యకలాపాలను నియంత్రించడమే ఈ ఆపరేషన్ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ప్రజలు తమ వాహనాలకు సంబంధించిన అన్ని పత్రాలను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచుకోవాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.
పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఇలాంటి ప్రత్యేక తనిఖీలు, కార్డన్ సెర్చ్ ఆపరేషన్లు నిరంతరం కొనసాగుతాయని పోలీసులు తెలిపారు









