భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో శనివారం రాత్రి ఏకకాలంలో నాకాబందీ కార్యక్రమం నిర్వహించారు. రాత్రి 7.30 గంటల నుంచి 10 గంటల వరకు జరిగిన ఈ ప్రత్యేక తనిఖీలలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.
జిల్లాలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు తావు లేకుండా ముందస్తు చర్యల భాగంగా వాహనాల తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. అలాగే పాత నేరస్తులను గుర్తించేందుకు ఫింగర్ ప్రింట్ డివైస్ ద్వారా తనిఖీలు చేపట్టారు.
గంజాయి వంటి మత్తు పదార్థాల అక్రమ రవాణాను అరికట్టడం, రోడ్డు ప్రమాదాలను తగ్గించడం లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు ఎస్పీ తెలిపారు. జిల్లా పరిధిలోని ఐదు సబ్ డివిజన్ల డిఎస్పీల ఆధ్వర్యంలో ప్రధాన కూడళ్లతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా నాకాబందీ నిర్వహించారు.
ఈ తనిఖీలలో పట్టుబడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలను కోరారు.








