మంగపేట:
మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణపై తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత వర్షాకాల సీజన్లో నర్సాపూర్ గ్రామంలో నిర్వహించిన మ్యాక్స్ సెంటర్లో భారీ అవకతవకలు జరిగినట్లు అప్పట్లో మండలమంతా చర్చ జరిగింది.
మ్యాక్స్ సెంటర్ నిర్వాహకులు ప్రభుత్వ నిధులను తమ సంబంధీకుల ఖాతాలకు మళ్లించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారం నెలరోజులపాటు సంచలనం రేపగా, కొన్ని నిఘా వర్గాలు గుట్టుచప్పుడు కాకుండా విచారణలు నిర్వహించినట్లు సమాచారం.
ఇంతటి వివాదం జరిగినప్పటికీ, ప్రస్తుత సీజన్లో అదే వ్యక్తులకు మళ్లీ ధాన్యం కొనుగోలు కేంద్రాల బాధ్యతలు అప్పగించడం అనుమానాలకు తావిస్తోంది. అధికార పార్టీ అండదండలతోనే ఈ నిర్ణయం తీసుకున్నారా అన్న ప్రశ్నలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులు నిద్రమత్తులో ఉన్నారా..? లేక ఉద్దేశపూర్వకంగానే చర్యలు తీసుకోవడం లేదా..? అనే చర్చ మండలంలో జోరుగా సాగుతోంది.
జ్వలా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కోడలు నరేష్ మాట్లాడుతూ,
ఇలాంటి అవకతవకలకు పాల్పడిన వారిని పక్కనపెట్టి, నిరుద్యోగ యువకులకు కొనుగోలు కేంద్రాల బాధ్యతలు అప్పగించాలని డిమాండ్ చేశారు. వెంటనే ప్రస్తుత కొనుగోళ్లను నిలిపివేసి పారదర్శకంగా వ్యవస్థను పునర్వ్యవస్థీకరించాలని ఆయన కోరారు.
అలా చేస్తేనే భవిష్యత్తులో అక్రమాలను అరికట్టగలమని ఆయన అభిప్రాయపడ్డారు.









