మహబూబాబాద్ ;
జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. విందు భోజనం చేస్తుండగా మాంసం ముక్క గొంతులో ఇరుక్కొని ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళితే.. గూడూరు మండలం పిల్లిగుండ్ల తండాలో మంగళవారం దుర్గమ్మ పండుగ సందర్భంగా విందు భోజనం ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో పాల్గొన్న 45 ఏళ్ల బానోత్ బిచ్చా తన బంధువులతో కలిసి భోజనం చేస్తుండగా, మాంసం ముక్క గొంతులో ఇరుక్కుంది. దీంతో ఆయన ఒక్కసారిగా ఊపిరి ఆడక ఇబ్బందిపడ్డాడు.
ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే సహాయం చేయడానికి ప్రయత్నించినప్పటికీ, ఫలితం లేకపోయింది. అనంతరం ఆయనను గూడూరు సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించగా అప్పటికే ఆయన మృతి చెందినట్లు ధ్రువీకరించారు.
సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇదిలా ఉండగా, ఇటీవల ఒడిశా రాష్ట్రంలో కూడా ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. చేప గొంతులో ఇరుక్కొని ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయిన విషయం స్థానికంగా కలకలం రేపింది.
ఈ ఘటనలు ఆహారం తీసుకునేటప్పుడు జాగ్రత్తలు ఎంత ముఖ్యమో గుర్తుచేస్తున్నాయి.








