మణుగూరు, ఏప్రిల్ 2:
వేసవి తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల పని వేళల్లో మార్పు చేయాలని కోరుతూ ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో కార్మికులు గురువారం సాయంత్రం మణుగూరు ఏరియా ఎస్ ఓ టు జీఎం బి. శ్రీనివాసచారి కి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ మణుగూరు ఏరియా అధ్యక్షులు మంగీలాల్ మాట్లాడుతూ, మణుగూరులో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, ముఖ్యంగా పారిశుద్ధ్య కార్మికులు, రోడ్ల క్లీనింగ్ సిబ్బంది, ఉద్యానవనాల్లో పనిచేస్తున్న కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
ప్రతి సంవత్సరం మానవతా దృక్పథంతో ఉదయం 6 గంటలకే పనులు ప్రారంభించి మధ్యాహ్నానికి ఎండలు తీవ్రంగా మారే సమయానికి పనులు ముగించేలా షిఫ్ట్ మార్పులు చేస్తారని గుర్తుచేశారు. ఇదే విధానాన్ని ఈ సంవత్సరం కూడా అమలు చేయాలని కోరారు.
అలాగే వివిధ గనులు మరియు విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు, ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు, డ్రైవర్లు, కోల్ ట్రాన్స్పోర్ట్ మరియు ఓబీ వర్కర్లకు మజ్జిగ, టీఆర్ఎస్ పాకెట్లు అందజేయాలని, పని ప్రదేశాల్లో చలువ పందిళ్లు ఏర్పాటు చేయాలని, ప్రథమ చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
వడదెబ్బ నివారణకు చర్యలు తీసుకోవడంతో పాటు సీజనల్ వ్యాధులపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కూడా కోరారు.
ఈ కార్యక్రమంలో కే. నాగేశ్వరరావు, యు. శివరామకృష్ణ, టి. రామకృష్ణ, ఎం. గురు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.








