వై7 న్యూస్ పలాస
పలాసలో నిర్వహించిన జాబ్ మేళాలో ఎమ్మెల్యే శిరీష పాల్గొని యువతకు ప్రేరణనిచ్చారు. యువత తమ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుని పట్టుదలతో కృషి చేస్తే ఉజ్వల భవిష్యత్తు వారిదేనని ఆమె పేర్కొన్నారు. వారి విజయం కుటుంబానికే కాకుండా మొత్తం పలాస నియోజకవర్గానికి గర్వకారణమవుతుందని చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల ద్వారా యువతలోని ప్రతిభను వెలికి తీసి, వారికి సరైన శిక్షణ అందించడం లక్ష్యమని వివరించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రానున్న రోజుల్లో 20 లక్షల ఉద్యోగాల సృష్టి దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని, ఇప్పటికే డీఎస్సీ, కానిస్టేబుల్ నియామకాలు చేపట్టిన విషయాన్ని గుర్తుచేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిరీష తన అనుభవాలను పంచుకుంటూ, వైఫల్యాలకు నిరుత్సాహపడకుండా ముందుకు సాగాలని యువతకు సూచించారు. “వైఫల్యమే విజయానికి మొదటి మెట్టు” అంటూ ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని హితవు పలికారు.
తన పదవికి అసలైన గౌరవం నియోజకవర్గ యువత ఉన్నత స్థాయికి చేరుకోవడంలోనే ఉందని పేర్కొన్న ఆమె, యువత తమ ఎంపిక చేసిన రంగాల్లో రాణించి, తల్లిదండ్రులు మరియు పలాస ప్రాంతానికి గర్వకారణంగా నిలవాలని ఆకాంక్షించారు.
జాబ్ మేళాకు యువత నుంచి మంచి స్పందన లభించిందని తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన విద్యావాహిని కళాశాల యాజమాన్యం, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు అభినందనలు తెలియజేశారు.








