వై7 న్యూస్
కాశీబుగ్గ పట్టణంలో ‘చిన్న తిరుపతి’గా ప్రసిద్ధిగాంచిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం అర్ధరాత్రి సమయంలో భారీ దొంగతనం చోటుచేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తులు ఆలయంలోకి చొరబడి, ముందుగా సీసీ కెమెరాల వైర్లను తొలగించి, ఆపై విలువైన వస్తువులను దొంగిలించినట్లు సమాచారం. ఈ దొంగతనంలో భారీ మొత్తంలో ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.విషయం వెలుగులోకి రావడంతో కాశీబుగ్గ పోలీసులు వెంటనే స్పందించారు. డీఎస్పీ షేక్ సహభాజ్ అహమ్మద్ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలన చేపట్టి, ఆధారాలు సేకరిస్తున్నారు. సీసీ ఫుటేజీ, పరిసర ప్రాంతాల్లోని కదలికలపై దృష్టి సారించి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.గమనార్హమైన విషయం ఏమిటంటే, ఈ ఆలయంలో గత ఏడాది నవంబర్లో జరిగిన తొక్కిసలాట ఘటనలో 9 మంది మృతి చెందడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఆ ఘటన అనంతరం భద్రతా కారణాల దృష్ట్యా ఆలయాన్ని మూసివేసిన పరిస్థితిలోనే ఈ దొంగతనం జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది.ఈ ఘటనపై భక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆలయ భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.









