వై7 న్యూస్ పలాస
నలుగురు నిందితుల అరెస్ట్ – 13 కిలోల గంజాయి స్వాధీనం
శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పరిధిలో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. రెండు వేర్వేరు ఘటనల్లో నలుగురు నిందితులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి మొత్తం 13 కిలోల గంజాయితో పాటు మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఇచ్చాపురం సీఐ ఎం. చిన్నం నాయుడు తెలిపారు.
వివరాల్లోకి వెళ్తే…
శనివారం ఇచ్చాపురం మండలం తోటూరు జంక్షన్ వద్ద గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. వారి వద్ద నుంచి 11 కిలోల గంజాయితో పాటు మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
అదేవిధంగా, అదే రోజు ఇచ్చాపురం రైల్వే స్టేషన్ సమీపంలో గంజాయి తరలిస్తున్న మరో వ్యక్తిని తనిఖీ చేయగా, అతని వద్ద నుంచి 2 కిలోల గంజాయి మరియు రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
అరెస్టు చేసిన నిందితులను రిమాండ్కు తరలించనున్నట్లు ఇచ్చాపురం సీఐ ఎం. చిన్నం నాయుడు తెలిపారు. గంజాయి అక్రమ రవాణాపై కఠిన చర్యలు కొనసాగుతాయని ఆయన హెచ్చరించారు.









