జిల్లా ప్రధాన న్యాయమూర్తిని ఆహ్వానించిన భద్రాచలం ఆలయ ఈవో
కొత్తగూడెం లీగల్: జనవరి 29, 30 తేదీల్లో భద్రాచలంలో జరగనున్న ముక్కోటి ఏకాదశి మహోత్సవాలకు ప్రత్యేక అతిథిగా హాజరుకావాలని కోరుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్కు మంగళవారం భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం కార్యనిర్వాహక అధికారి దామోదర్ రావు ఆహ్వాన పత్రికను అందజేశారు.
ఈ సందర్భంగా కొత్తగూడెం జిల్లా కోర్టులోని ప్రధాన న్యాయమూర్తి చాంబర్లో ఆలయ ఈఓ దామోదర్ రావు, న్యాయమూర్తి పాటిల్ వసంత్ను సన్మానించారు.
అనంతరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ ముక్కోటి ఏకాదశి ఉత్సవాల నిర్వహణకు సంబంధించి ఆలయంలో చేపడుతున్న ఏర్పాట్లను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా భద్రాచలం ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున, వారికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని సూచించారు.
భక్తులకు తాగునీరు, వసతి, వైద్య సేవలు, పారిశుద్ధ్యం, ట్రాఫిక్ నియంత్రణతో పాటు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు కల్పించాలని అధికారులను ఆదేశించారు. సంబంధిత శాఖల సమన్వయంతో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలను భక్తులు మెచ్చేలా ఘనంగా నిర్వహించాలని ఆయన పేర్కొన్నారు.









