బాలకార్మికుల వివరాలు తెలిస్తే వెంటనే సమాచారం ఇవ్వండి
భద్రాద్రి కొత్తగూడెం,జూలై 01 వై 7 న్యూస్;
బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్ 11వ విడుత కార్యక్రమం జూలై 1 నుండి 31వ తారీఖు వరకు జిల్లాలో పటిష్టమైన ప్రణాళికతో అమలు చేయడం జరుగుతుందని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ తెలిపారు.ఈ సందర్భంగా ఈ రోజు ఆపరేషన్ ముస్కాన్-XI అధికారులు మరియు సిబ్బందితో కలిసి ఎస్పీ కార్యాలయంలో పోస్టర్ ను ఆవిష్కరించారు.బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి ప్రతీ సబ్ డివిజన్ పరిధిలో ఒక ఎస్ఐ మరియు నలుగురు సిబ్బందిని ఒక బృందంగా నియమిచడం జరిగిందని తెలిపారు.పోలీసు శాఖతో పాటు ఇతర శాఖల అధికారులతో కలిసి సంయుక్తంగా దాడులు నిర్వహించాలని సూచించారు.జిల్లా వ్యాప్తంగా 05 ప్రత్యేక బృందాలు ఈ నెల రోజులపాటు ఆపరేషన్ ముస్కాన్-XIలో భాగంగా బాలకార్మికులను గుర్తించడానికి దాడులు నిర్వహిస్తారని తెలియజేసారు.గత జనవరిలో జరిగిన ఆపరేషన్ స్మైల్ లో 40 మంది పిల్లలను గుర్తించి రాష్ట్రంలోనే జిల్లా ఐదో స్థానంలో నిలిచిందని తెలిపారు.ఎక్కడైనా బాలకార్మికులను గుర్తిస్తే వెంటనే 1098 లేదా డయల్ 100 లేదా స్థానిక పోలీస్ అధికారులకు సమాచారం అందించాలని ఈ సందర్బంగా ఎస్పీ విజ్ఞప్తి చేశారు.
జిల్లా ఎస్పీ ఆదేశాలతో ఈ ఆపరేషన్ ముస్కాన్-XI నకు జిల్లా నోడల్ అధికారిగా వ్యవహరిస్తున్న కొత్తగూడెం డిఎస్పి రెహమాన్ గారి ఆధ్వర్యంలో ఆపరేషన్ ముస్కాన్-XI బృందాలలో నియమింపబడిన పోలీస్ అధికారులు,సిబ్బంది మరియు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ,లేబర్ డిపార్ట్మెంట్,ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, చైల్డ్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్,హెల్త్ డిపార్ట్మెంట్ మరియు వివిధ డిపార్ట్మెంట్ అధికారులతో స్థానిక PR ఫంక్షన్ హాలులో సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది.జిల్లాలో పలు హాట్ స్పాట్స్ ను గుర్తించి అక్కడ ప్రత్యేకంగా నిఘా ఉంచాలని ఈ సందర్బంగా డిఎస్పీ రెహమాన్ ముస్కాన్ అధికారులకు సూచించారు.గతంలో ఆపరేషన్ ముస్కాన్ ద్వారా రెస్క్యూ చేసిన పిల్లల యొక్క ప్రస్తుతం పరిస్థితి గురించి తెలుసుకోవాలని అన్నారు.బడికి వెళ్లకుండా చదువు మానేసి పనులు చేస్తున్న పిల్లలను గుర్తించి వారిని మరలా స్కూల్లో చేర్పించి విద్యావంతులుగా తీర్చిదిద్దాలని తెలిపారు.కిరాణషాపులలో,మెకానిక్ షాపులలో,హోటళ్లలో,ఇటుక బట్టీలలో,పౌల్ట్రీ ఫామ్ లలో,రోడ్డుపై భిక్షాటన చేస్తున్న పిల్లలు మరియు ఇతర ప్రదేశాలలో తప్పిపోయిన,వదిలివేయబడిన పిల్లలు బాలకార్మికులుగా పని చేస్తున్నట్లయితే అలాంటి వారిని గుర్తించి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి వారికి అప్పగించడం,లేదా వారిని సంరక్షణా గృహాలకు తరలించేలా చర్యలు తీసుకోవాలన్నారు.చిన్న పిల్లలతో ఎవరైనా బలవంతంగా బిక్షాటన మరియు వెట్టి చాకిరీ చేయిస్తున్నట్లు దృష్టికి వస్తే వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వెల్ఫేర్ అధికారి స్వర్ణలత లెనీనా,ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్,డీసిపీఓ హరి కుమారి,అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ షర్ఫుద్దీన్,చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు,చైల్డ్ హెల్ప్ లైన్ కో-ఆర్డినేటర్ సందీప్ మరియు ఎస్సైలు రమాదేవి,విజయ కుమారి, ఏసోబు,సూర్యం మరియు ఇతర అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.