కాకినాడ, మే 29 (ప్రత్యేక ప్రతినిధి):
సంపర నియోజకవర్గానికి రెండు పర్యాయాలు శాసనసభ్యులుగా (1989–1994, 2004–2009) ప్రజాసేవ చేసిన స్వర్గీయ అనిశెట్టి బుల్లెబ్బాయిరెడ్డి ప్రధమ వర్థంతి సందర్భంగా, ఈ రోజు కాకినాడ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో లెప్రసీ, క్యాన్సర్, ఐసోలేషన్, చర్మవ్యాధుల వార్డులలో రోగులకు దుప్పట్లు, యాపిల్, బత్తాయి పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన కుమార్తె మాట్లాడుతూ – “మా నాన్నగారు రాజకీయాలలో అడుగుపెట్టిన 1987 నుంచి రైతులు, బడుగు, బలహీన వర్గాల కోసం అశేష సేవలు చేశారు. ఆయనలోని ప్రజాప్రేమ, సేవా తపన నాకు బాల్యం నుంచి స్ఫూర్తిగా నిలిచాయి” అని భావోద్వేగంగా వెల్లడించారు.
అనిశెట్టి బుల్లెబ్బాయిరెడ్డి కాకినాడ ఆర్.టి.సి. చైర్మన్గా పని చేసిన కాలంలో ప్రతి గ్రామానికి రవాణా సౌకర్యం కల్పించేందుకు విశేషంగా కృషి చేసిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. అలాగే, తన సొంత మండలమైన ఉప్పాడలోని వి.వి.ఎస్ విద్యా సంస్థల ద్వారా పేద విద్యార్థులకు విద్య అందించాలనే ఆశయంతో వ్యాపార కోణం లేకుండా పాఠశాలలు నెలకొల్పిన ఆయన వినూత్న ప్రయత్నాన్ని ఆమె ప్రశంసించారు.
ఉప్పాడ తీర ప్రాంతాన్ని సముద్రం కోత నుండి రక్షించేందుకు జియోట్యూబ్ నిర్మాణం కోసం కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు సహకారంతో నిధులు రాబట్టి మత్స్యకారులకు భద్రత కల్పించిన ఘనత కూడా బుల్లెబ్బాయిరెడ్డి దేనని తెలిపారు.సేవా స్పూర్తికి కొనసాగింపుగా, స్వర్గీయ అనిశెట్టి బుల్లెబ్బాయిరెడ్డి పేరిట ఫౌండేషన్ లేదా ట్రస్ట్ ఏర్పాటు చేసి ప్రజాహిత కార్యక్రమాలు కొనసాగించాలని, కాకినాడ, పిఠాపురం పరిసర ప్రాంతాల్లో ఆయన విగ్రహాలను ఏర్పాటు చేయాలని అభిమాన సంఘాలు, అనుచరులు సూచించినట్లు ఆమె తెలిపారు. ఇందుకోసం జిల్లా కలెక్టర్ మరియు డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ దృష్టికి ఈ అంశం తీసుకువెళ్లి అనుమతులు కోరతామని చెప్పారు.“తండ్రికి తగ్గ తనయురాలిగా ఆయన ఆశయ సాధన కోసం న్యాయబద్ధంగా, రాజీలేని పోరాటంతో సేవా తత్పరతతో ముందుకెళతాను” అని ఆమె ధృఢ సంకల్పంతో ప్రకటించారు.