వై 7 న్యూస్ (విజయనగరం జిల్లా) : రైల్వే స్టేషన్, బస్టాండులో డాగ్ స్క్వాడ్ బృందాలు డిఎస్పీ ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారాని విజయనగరం ఎస్పి వకులు జిందాల్ తెలిపారు. విజయనగరం పట్టణంలో గంజాయి, యితర మాదక ద్రవ్యాల నియంత్రణలో భాగంగా ఆకస్మికంగా డాగ్ స్క్వాడ్ బృందాలతో ఆకస్మిక తనిఖీలను శనివారం చేపట్టినట్లుగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. ఎస్పి ఆదేశాలతో విజయనగరం డిఎస్పీ ఎం.శ్రీనివాసరావు, వన్ టౌన్ ఇంచార్జీ సిఐ ఎల్.అప్పల నాయుడు, వన్ టౌన్ ఎస్సై లు, సిబ్బంది పట్టణంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పట్టణంలో రద్దీగా ఉండే రైల్వే స్టేషన్, బస్టాండ్ ప్రాంతాలను, షాపులను పోలీసు బృందాలు, పోలీసు జాగిలాలు తనిఖీ చేశాయి. గంజాయి అక్రమ రవాణాను మరింత కట్టుదిట్టంగా నియంత్రించుటలో భాగంగా ఈ బృందాలు ఆకస్మిక తనిఖీలు ఏకకాలంలో చేపట్టాయని జిల్లా ఎస్పీ తెలిపారు. సెక్యూరిటీ ఆర్ఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో స్నిఫర్ డాగ్స్ ప్రయాణికుల బ్యాగులు, మూటలను, అనుమానస్పద పార్సెల్స్ వాసన చూసి, వాటిని తనిఖీ చేశాయి. రైల్వే స్టేషన్ ప్లాట్ ఫాం పై ప్రయాణికుల బ్యాగులు, మూటలను, షాపులను తనిఖీ చేసి, వాటిలో గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలు ఏమైనా ఉన్నాయా..? అన్న విషయాన్ని నిర్ధారించుకొని, వాటిని తిరిగి అప్పగించారు. రైల్వే స్టేషన్ పై ఉన్న అన్ని ప్లాట్ ఫామ్స్ ను, పార్శిల్ ఆఫీసు వద్ద ఉన్న పార్శిల్స్ ను డాగ్ స్క్వాడ్ బృందాలు, పోలీసు బృందాలు తనిఖీ చేశాయి. ఆర్టీసీ కాంప్లెక్స్ ప్రాంతంలో బస్సుల గురించి వేచి ఉన్న ప్రయాణికుల బ్యాగులు, మూటలు, యితర వస్తువులను, షాపులను పోలీసు బృందాలు, జాగిలాలు తనిఖీ చేశాయి. అనంతరం, ఆర్టీసీ కాంప్లెక్స్ పరిధిలోని పార్శిల్ ఆఫీసు వద్ద బయట ఉన్న మూటలను, పార్సిల్స్ ను డాగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీ చేసాయి. గంజాయి, యితర మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నియంత్రణలో భాగంగా జిల్లా ఎస్పీ వారి ఆదేశాల మేరకు ఆకస్మిక తనిఖీలు చేపట్టామని విజయనగరం డిఎస్పీ ఎం.శ్రీనివాసరావు తెలిపారు. ఈ ఆకస్మిక తనిఖీల్లో విజయనగరం వన్ టౌన్ ఇన్చార్జి సిఐ ఎల్.అప్పల నాయుడు, ఎస్సై లు నరేష్, అశోక్ కుమార్, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.









