

పలాస, ఆగస్టు 15 (వై7 న్యూస్): 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని పలాస–కాశీబుగ్గ పురపాలక సంఘ కార్యాలయంలో శనివారం ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలాస నియోజకవర్గ ఎమ్మెల్యే గౌతు శిరీష పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌతు శిరీష చేతుల మీదుగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం పురపాలక సంఘంలో తమకు కేటాయించిన విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మున్సిపల్ సిబ్బందికి ప్రోత్సాహక ధ్రువీకరణ పత్రాలను అందజేసి అభినందించారు.
అలాగే మున్సిపల్ కార్యాలయ సిబ్బంది కోసం నిర్వహించిన క్రికెట్ పోటీల్లో ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, దేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను అర్పించిన మహనీయుల త్యాగాలను స్మరించుకోవాలని, వారి ఆశయాలకు అనుగుణంగా ప్రజాసేవలో మరింత నిబద్ధతతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పురపాలక సంఘ అధికారులు, ప్రజాప్రతినిధులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.









