ఖమ్మం, జూన్ 19 (వై7 న్యూస్): ప్రముఖ విద్యాసంస్థను లక్ష్యంగా చేసుకుని నకిలీ పత్రాలు, నకిలీ MOU (మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్)లతో రూ.10 లక్షలు మోసం చేసిన సైబర్ నేరస్తుడిని ఖమ్మం సైబర్ క్రైమ్ పోలీసులు హైదరాబాద్లో అరెస్టు చేశారు. ఈ విషయాన్ని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ వెల్లడించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లాకు చెందిన ఓ ప్రముఖ విద్యాసంస్థకు నిందితుడు వాట్సాప్ ద్వారా సంప్రదించి, తాను ఐఐటీ హైదరాబాద్ ప్రొఫెసర్నని పరిచయం చేసుకున్నాడు. విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని నమ్మబలికి, నకిలీ డాక్యుమెంట్లు మరియు నకిలీ MOUలను ఆన్లైన్లో పంపించాడు. వాటిని నమ్మిన విద్యాసంస్థ నుంచి రూ.10 లక్షలు తీసుకుని మోసానికి పాల్పడ్డాడు
ఈ మేరకు నమోదైన కేసును విచారించిన ఖమ్మం సైబర్ క్రైమ్ పోలీసులు, నిందితుడు డి. రవికిరణ్ (26)ను హైదరాబాద్లో అరెస్టు చేశారు. అనంతరం ఖమ్మం సైబర్ క్రైమ్ కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించినట్లు కమిషనర్ తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందన్నారు.
ఈ కేసు ఛేదనలో కీలక పాత్ర పోషించిన సైబర్ క్రైమ్ డీఎస్పీ ఫణీందర్, సీఐ భూక్యా రవికుమార్, ఎస్సైలు రంజిత్ కుమార్, విజయకుమార్, కానిస్టేబుళ్లు కృష్ణారావు, నాగేశ్వరరావు తదితర సిబ్బందిని పోలీస్ కమిషనర్ అభినందించారు.








