కొత్తగూడెం;
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కొత్తగూడెం–ఇల్లందు క్రాస్ రోడ్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో సింగరేణి కార్మికుడు మృతి చెందాడు.మణుగూరు రాజుపేటకు చెందిన ఉపేందర్ భూపాలపల్లి సింగరేణిలో ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. విధులు ముగించుకుని మంగళవారం రాత్రి కారులో మణుగూరులోని తన నివాసానికి బయలుదేరాడు. ఈ క్రమంలో కొత్తగూడెం–ఇల్లందు క్రాస్ రోడ్ సమీపంలో కారు వెనుక భాగంలో ఏదో శబ్దం వినిపించడంతో వాహనాన్ని ఆపి పరిశీలిస్తున్నాడు.
అదే సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ కారును, అక్కడ ఉన్న ఉపేందర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఉపేందర్ తీవ్రంగా గాయపడి ఘటనాస్థలంలోనే మృతి చెందాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఉపేందర్ మృతితో మణుగూరు ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Post Views: 45









