ఇచ్చాపురం, జూన్ 15 (వై7 న్యూస్): శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం రైల్వే స్టేషన్లో గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న ఇద్దరు మహిళలను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి సుమారు 32.360 కిలోల గంజాయితో పాటు రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
ఇచ్చాపురం పట్టణ ఇన్స్పెక్టర్ ఎం. చిన్నం నాయుడు తెలిపిన వివరాల ప్రకారం, సోమవారం ఉదయం అందిన విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్ఐ ఎం. ముకుందరావు తన సిబ్బందితో కలిసి రైల్వే స్టేషన్ పరిసరాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా, వారి వద్ద ఉన్న రెండు సూట్కేసులు మరియు ఒక లగేజీ బ్యాగులో 32.360 కిలోల గంజాయి ఉన్నట్లు గుర్తించారు.
అరెస్టు చేసిన మహిళలను యాస్మిన్ యూసుఫ్ పట్నీ, షరీఫాబీ దస్తగిరిగా గుర్తించారు. వీరు గృహ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా గంజాయి వ్యాపారం చేసే మహ్మద్ షరీఫ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడిందని, అతని సూచనల మేరకు ఒడిశాకు వెళ్లి గంజాయిని తీసుకువచ్చి అప్పగిస్తే ప్రతి సారి రూ.10 వేల చొప్పున ఇస్తానని చెప్పడంతో ఈ అక్రమ రవాణాకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది.
పోలీసుల వివరాల ప్రకారం, ఈసారి ఒడిశాలోని బరంపురానికి వెళ్లిన అనంతరం ముకేష్ అనే వ్యక్తి నుంచి గంజాయిని స్వీకరించి, రైలులో తరలించేందుకు ఇచ్చాపురం రైల్వే స్టేషన్కు వెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి, మొబైల్ ఫోన్లను సీజ్ చేసి, నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.








