రూ.50 లక్షలతో సీసీ రోడ్లు, సైడ్ డ్రెయిన్ పనులకు భూమిపూజ
మణుగూరు, జూన్ 13: ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు మండల పరిధిలో సుందరయ్య నగర్, మేదర్ బస్తి, కుంకుడు చెట్ల గుంపు ప్రాంతాల్లో రూ.50 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు, సైడ్ డ్రెయిన్ నిర్మాణ పనులకు శనివారం ఆయన భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న రహదారి, మురుగునీటి పారుదల సమస్యలకు శాశ్వత పరిష్కారం కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. గ్రామాలు, కాలనీలు, గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు.
సీసీ రోడ్లు, సైడ్ డ్రెయిన్ నిర్మాణ పనులు పూర్తయిన తర్వాత ప్రజలకు రాకపోకలు మరింత సులభతరం అవుతాయని, వర్షాకాలంలో నీటి నిల్వలు, బురద సమస్యలు తగ్గి ప్రజలకు ఉపశమనం కలుగుతుందని పేర్కొన్నారు. ముఖ్యంగా విద్యార్థులు, మహిళలు, వృద్ధులు, ఉద్యోగులకు ఈ పనులు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని అన్నారు.
పినపాక నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే తన లక్ష్యమని, ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తున్నానని ఎమ్మెల్యే తెలిపారు. అలాగే రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం గ్రామీణాభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, సంక్షేమ పథకాల అమలులో ముందంజలో ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో ఏఈ, డీఈతో పాటు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పిరినాకి నవీన్, టౌన్ అధ్యక్షుడు శివ సైదులు, మైనారిటీ అధ్యక్షుడు రహీం పాషా, ఐఎన్టీయూసీ రాష్ట్ర నాయకుడు సామా శ్రీనివాసరెడ్డి, మహిళా అధ్యక్షురాలు కూరపాటి సౌజన్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.








