సూర్యాపేట జిల్లా, హుజూర్నగర్:
వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు ఉపశమనం కలిగించేలా KSR ఫౌండేషన్ దిల్ యువసేన ఆధ్వర్యంలో హుజూర్నగర్ పట్టణ కేంద్రంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. కీర్తిశేషులు, 11వ వార్డు మాజీ కౌన్సిలర్ మరియు కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ కస్తాల శ్రావణ్ కుమార్ జ్ఞాపకార్థం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ చలివేంద్రాన్ని హుజూర్నగర్ ఎస్సై బండి మోహన్, మునిసిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ అశోక్ ప్రారంభించి మజ్జిగ పంపిణి చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేసవి కాలంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. సేవా దృక్పథంతో ముందుకొచ్చిన KSR ఫౌండేషన్ దిల్ యువసేన సభ్యులను ప్రశంసించారు.
దిల్ యువసేన నాయకులు కస్తాల దిల్ మాట్లాడుతూ ఎండల తీవ్రత రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు చల్లని తాగునీరు అందించడం అత్యవసరమని తెలిపారు. ప్రయాణికులు, కార్మికులు, రోడ్లపై పని చేసే ప్రజలకు ఈ చలివేంద్రం ఎంతో ఉపశమనం కలిగిస్తుందని అన్నారు.
“సేవే మా లక్ష్యం” అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాలు మరింతగా చేపడతామని దిల్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో దిల్ యువసేన సభ్యులు ప్రదీప్, కిరణ్, గోపి, సాయి నరేష్, క్రాంతి నాగరాజు, పవన్, చంటి సతీష్, గోపి ప్రేమ్, లోకేశ్, రాము, క్రిష్ తదితరులు పాల్గొన్నారు








