ఆగస్టు నెల ముగియడానికి మరో ఐదు రోజులు మాత్రమే ఉన్నాయి. సెప్టెంబర్ 1 నుంచి మన రోజువారీ జీవితంపై ప్రభావం చూపే పలు కీలక మార్పులు అమల్లోకి రానున్నాయి. ముఖ్యంగా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు మరోసారి మారే అవకాశం ఉంది. చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రతి నెల 1వ తేదీన గ్యాస్ ధరలను సవరిస్తుంటాయి. ఆగస్టు 1న 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధరపై రూ.202 తగ్గించినప్పటికీ.. 14.2 కిలోల గృహ వినియోగ సిలిండర్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు. దీంతో సెప్టెంబర్ 1న ధరలపై అందరి దృష్టి నెలకొంది.
మరోవైపు గ్యాస్ వినియోగదారులకు e-KYC కీలకంగా మారింది. ఎల్పీజీ వినియోగదారులు తమ e-KYC ప్రక్రియను పూర్తి చేసుకోవడానికి గడువును ఆగస్టు 23 నుంచి ఆగస్టు 31 వరకు పొడిగించినట్లు సమాచారం. ఐఓసీఎల్, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ వినియోగదారులు ఈ గడువులోగా e-KYC పూర్తి చేయకపోతే.. సెప్టెంబర్ 1 తర్వాత సిలిండర్ సరఫరా లేదా సబ్సిడీ విషయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. అందుకే గ్యాస్ కనెక్షన్కు సంబంధించిన KYC వివరాలను ముందుగానే చెక్ చేసుకోవడం మంచిది.
ఇక ఎల్పీజీతో పాటు వైమానిక ఇంధనం (ATF), CNG, PNG ధరల్లోనూ సెప్టెంబర్ 1న మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ATF ధరల్లో వచ్చే మార్పులు విమానయాన సంస్థల నిర్వహణ ఖర్చులపై ప్రభావం చూపుతాయి. దాని ఆధారంగా విమాన టికెట్ ధరల్లో కూడా మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సెప్టెంబర్ ప్రారంభం నుంచి గ్యాస్, ఇంధనం, ప్రయాణ ఖర్చులకు సంబంధించిన ధరలపై ప్రజలు ఓ కన్నేసి ఉంచాల్సి ఉంటుంది.









