రాజస్తాన్ రాయల్స్ యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రం కోసం ఎదురుచూస్తున్నప్పటికీ ఇప్పటివరకు భారత జట్టులో అవకాశం దక్కలేదు. ఐపీఎల్-2026లో అద్భుత ప్రదర్శనతో ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలకు ఎంపికైన టీ20 జట్టులో చోటు సంపాదించినా, ఐర్లాండ్తో జరిగిన రెండు మ్యాచ్ల్లోనూ అతడిని తుది జట్టులోకి తీసుకోలేదు. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ బెంచ్కే పరిమితమయ్యాడు. టీమ్ మేనేజ్మెంట్ మాత్రం సంజూ శాంసన్, అభిషేక్ శర్మలతోనే ఓపెనింగ్ను కొనసాగించింది.
ఈ నిర్ణయంపై భారత మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఐర్లాండ్ సిరీస్లోనే వైభవ్ సూర్యవంశీకి అంతర్జాతీయ అరంగేట్రం చేసే అవకాశం ఇవ్వాల్సిందని అభిప్రాయపడ్డాడు. బెల్ఫాస్ట్ పిచ్ నెమ్మదిగా ఉండటంతో పాటు మైదానం కూడా చిన్నదిగా ఉండటంతో అతడు భారీ షాట్లు ఆడేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని పేర్కొన్నాడు.
“వైభవ్ ఆడివుంటే బంతులను స్టేడియం బయటకు పంపేవాడు. తన దూకుడు బ్యాటింగ్తో ప్రత్యర్థి బౌలర్లపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చేవాడు. అతడిని ఆడించకపోవడం నిరాశ కలిగించింది. ఇంగ్లండ్ పర్యటనలో అయినా అవకాశం ఇస్తారో లేదో చూడాలి” అంటూ రవిశాస్త్రి వ్యాఖ్యానించాడు.








