వై 7 న్యూస్ పలాస
శ్రీకాకుళం జిల్లా మందస మండలంలో ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరు గిరిజనులు అడవి పంది ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డారు.
వివరాల ప్రకారం… చిప్పి గ్రామానికి చెందిన సవర ప్రదీప్, సవర సూర్యారావు ఒడిశా రాష్ట్రంలోని జారాడ గ్రామానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో ఉన్నారు. ఈ క్రమంలో కుల్లాడ సమీపానికి చేరుకోగానే అడవి నుంచి అకస్మాత్తుగా ఒక అడవి పంది రోడ్డుపైకి దూసుకొచ్చింది. దాంతో వారు ప్రయాణిస్తున్న బైక్ను ఢీకొట్టడంతో ఇద్దరూ రోడ్డుపై పడిపోయారు.
ఈ ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలు కాగా, స్థానికులు వెంటనే 108 అంబులెన్స్కు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న వైద్య సిబ్బంది గాయపడిన వారిని హరిపురం ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అడవి జంతువులు అకస్మాత్తుగా రోడ్లపైకి రావడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.








