ఉన్నతాధికారుల అనుమతి లభిస్తే దేవ దర్శనాలు ప్రారంభం
కాశీబుగ్గ:
కాశీబుగ్గలోని చిన్న తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఇటీవల జరిగిన తొక్కిసలాట ఘటనలో తొమ్మిది మంది భక్తులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటన నేపథ్యంలో ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు.
ఈ ఘటన పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ సూచనల మేరకు ఆలయంలో భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. బారికేడ్లు ఏర్పాటు చేయడం, సీసీ కెమెరాల అమరిక, భక్తుల రాకపోకల కోసం ప్రత్యేక ఇన్–ఔట్ గేట్ల ఏర్పాటు వంటి పనులు చేపట్టి, వాటిలో 90 శాతం వరకు పూర్తి చేసినట్లు ఆలయ ధర్మకర్త హరిముకుంద పండా తెలిపారు.
ఉన్నతాధికారులు ఆలయాన్ని పరిశీలించి అనుమతి ఇస్తే వెంటనే భక్తులకు దేవ దర్శనాలు కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు. భక్తుల భద్రతకు ఎలాంటి లోటు లేకుండా ప్రైవేట్ సిబ్బందితో పాటు పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.









