వై7 న్యూస్ పలాస;
చీటింగ్ కేసులో ఒక నిందితుడిని కాశీబుగ్గ పోలీసులు అరెస్ట్ చేశారు. పలాసకు చెందిన జెన్నా సునీల్ (కారు డ్రైవర్) ఈ కేసులో ప్రధాన నిందితుడిగా పోలీసులు గుర్తించారు. కేసు వివరాలను కాశీబుగ్గ సీఐ వై. రామకృష్ణ ఆదివారం సాయంత్రం వెల్లడించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…
తేదీ 08-12-2025 న మొగిలిపాడు బ్రిడ్జ్ వద్ద నిందితుడు సునీల్, ఒడిశా రాష్ట్రానికి చెందిన మరో వ్యక్తితో కలిసి ఫిర్యాదిదారు లోట్ల లచ్చనయ్యను మోసగించాడు. తమ వద్ద బ్లాక్మణి ఉందని నమ్మబలికి లచ్చనయ్య నుంచి రూ.10 లక్షలు తీసుకున్నారు. బదులుగా ఆ బ్యాగ్లో రూ.50 లక్షలు ఉన్నాయని చెప్పి, కేవలం పుస్తకాలతో నింపిన బ్యాగ్ను ఇచ్చి అక్కడి నుంచి పరారయ్యారు.
తరువాత బ్యాగ్ను తెరిచి చూసిన ఫిర్యాదిదారు తాను మోసపోయినట్లు గ్రహించి కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీ ఎన్ని రామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
దర్యాప్తులో భాగంగా, ఈరోజు అమరావతి డాబా సమీపంలో నిందితుడు సునీల్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ.4,42,000 నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ కేసులో రెండవ నిందితుడి కోసం ప్రత్యేక పోలీస్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టినట్లు, త్వరలోనే అతడిని కూడా అరెస్ట్ చేస్తామని సీఐ వై. రామకృష్ణ తెలిపారు.









