పశ్చిమ బెంగాల్లోని బీర్భూమ్ జిల్లాలో తెల్లవారుజామున ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. తారాపీఠ్ ఆలయ పట్టణంలోని ఓ నాలుగు అంతస్తుల హోటల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ఘటనతో హోటల్లో ఉన్నవారిలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.
మంటలు వేగంగా వ్యాపించడంతో పలువురు హోటల్లో చిక్కుకున్నట్లు సమాచారం. ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలు కాగా, వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు.
ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. మంటల్లో చిక్కుకున్న మరికొందరి పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతోంది. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్న నేపథ్యంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.








