
ములుగు, ఆగస్టు 15 (ప్రతినిధి): దేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ములుగు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో శనివారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు.
అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగాలు చేసిన మహనీయుల సేవలను ప్రతి భారతీయుడు స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. వారి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని దేశాభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ అంకితభావంతో కృషి చేయాలని సూచించారు.
ప్రభుత్వ అధికారులు, సిబ్బంది ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించే దిశగా బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని కలెక్టర్ పేర్కొన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసించి ఉన్నత లక్ష్యాలను సాధించి దేశానికి ఆదర్శ పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు.
కార్యక్రమం అనంతరం విద్యార్థులకు నోట్బుక్లను పంపిణీ చేశారు. ఈ వేడుకల్లో అదనపు కలెక్టర్లు సి.హెచ్. మహేందర్, జి. సంపత్ రావు, ఆర్డీఓ కృష్ణవేణి, డిఆర్ఓ రవికుమార్, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి షా ఫైజల్ హుస్సేనీ, జిల్లా విద్యాశాఖ అధికారి సిద్ధార్థ రెడ్డి, జిల్లా పౌర సంబంధాల అధికారి ఎం.డి. రఫిక్, కలెక్టరేట్ ఏఓ రాజ్ కుమార్తో పాటు వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.









