దుమ్ముగూడెం, జూలై 16 (వై7 న్యూస్):
దుమ్ముగూడెం మండల రైతుల చిరకాల వాంఛ అయిన ప్రగళ్లపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి నిధులు కేటాయించి పనులు ప్రారంభించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని బీఆర్ఎస్ నాయకులు స్పష్టం చేశారు. సీతారామ ప్రాజెక్టు విషయంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని వారు ఆరోపించారు.
ఉప ముఖ్యమంత్రి సహా ముగ్గురు మంత్రులు సీతారామ ప్రాజెక్టును సందర్శిస్తున్న నేపథ్యంలో, భద్రాచలం ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రగళ్లపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి నిధులు కేటాయించి దుమ్ముగూడెం మండల గిరిజన రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు పిలుపు మేరకు ఉద్యమానికి సిద్ధమవుతున్న నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. రైతుల సమస్యలపై ప్రశ్నించినందుకు నిర్బంధ చర్యలు చేపట్టడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు.
జిల్లా రైతాంగం సాగునీటి సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని, గోదావరి జలాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా చివరి ఎకరం వరకు చేరే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. రైతుల సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ సమాధానాలు రాబడతామని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో దుమ్ముగూడెం మండల బీఆర్ఎస్ కన్వీనర్ కణితి రాముడు, మాజీ పీపి రేసు లక్ష్మి, ప్యాక్స్ డైరెక్టర్ బొల్లి వెంకట్రావు, పార్టీ నాయకులు తునికి కామేష్, దామెర్ల శ్రీనివాసరావు, లంక శివ తదితరులు పాల్గొన్నారు.









